వేదాంతం
ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు “అజ్ఞానమే” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి. అనగా అన్ని ప్రాణులలో ఉన్నది నేనే అనే విషయాన్ని అర్ధంచేసుకుని, అనుభూతి చెందాలి. అన్నీ తానే ఐనప్పుడు, అన్నింటిలో ఉన్నది తానే అని తెలుసుకున్నప్పుడు మరొకర్ని ఎలా బాధపెట్టగలడు? ఇతరులను ఎలా మోసం చేయగలడు? నీవలెనే నీ ఎదుటివారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయని గ్రహించగలిగితే వారి ఆశలను అడియాశలు చేయలేవుగదా! అంతటి ఉన్నతమైన స్ధితికి మానవుని ఆలోచనా విధానం ఎదగాలి. ఈ విషయం బాగా అర్ధమై వంటబట్టాలంటే మనం ఎల్లప్పుడూ సాధన చేయాలి. అంటే, సదాచారము, మంచి మంచి పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం, సజ్జన సాంగత్యం లాంటివి చేయాలి. మంచి ఆలోచనలు చేస్తూ, పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి.
వేదాంతం అనగానే కంగారుపడవలసిన అవసరంలేదు. నిన్ను నీవు తెలుసుకోవడమే వేదాంతం. నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్యలు విజ్ఞానాన్ని, ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తే ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదు. చివరకు అప్పుడైనా ఆత్మ విద్యను ఆశ్రయిం చక తప్పదు. కాబట్టి లౌకిక విద్యలతోపాటు ఆధ్యాత్మిక విద్యను, అంటే నీ అసలు స్వరూపాన్ని నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం.
వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది.
వేదాంతసారమును సంక్షిప్తముగ చెప్పాలనిన “అజ్ఞానిగ ఉండిన జీవుడు – సుజ్ఞానిగ నిలిచిన దేవుడు. భ్రమలో ఉండిన జీవుడు – భ్రమలుడిగిన దేవుడు. సాకారుడైన జీవుడు – నిరాకారుడైన దేవుడు. శరీరభావన గలవాడైన జీవుడు – అశరీరాత్మ భావన గలవాడైన భగవంతుడు. సంకుచిత పరిధిలో జీవుడు – సర్వాత్మ స్ధితిలో దేవుడు. వ్యష్టిగ ఆలోచించిన జీవుడు – సర్వ సమిష్టి భావముతో దేవుడు. పలికినంతసేపు జీవుడు – పలుకులేనివాడే దేవుడు. పూనక శిగములు ఊగినంతకాలం జీవుడు – ఊరకుండిన (అచలం) దేవుడు. చూచినంతకాలం జీవుడు – చూడబడేవాడు దేవుడు. చపల చిత్తుడు జీవుడు – స్ధితప్రజ్ఞుడు దేవుడు. మాయాలోలుడు జీవుడు-మాయాతీతుడు దేవుడు. ఖండ దృష్టిలో జీవుడు – అఖండ దృష్టిలో దేవుడు. ద్వైత దృష్టి లో జీవుడు – అద్వైత స్ధితిలో దేవుడు. కావున మనం ఏ అంతస్తులో ఉన్నామో తెలుసుకోవాలి.
వేదములయొక్క అంతమును “వేదాంతము” అందురు. ఇది ఆధ్యాత్మిక రంగంలో జ్ఞాన కాండ. యజ్ఞ, యాగ, క్రతు కర్మలన్నియూ చిత్తశుద్ధికి తోడ్పడి, ఆధ్యాత్మిక స్ధితికి చేర్చే సోపానములు మాత్రమే. సమస్త యుగజగంబులు, సర్వలోకములు, సమస్త భక్తులు, సమస్త ముక్తులు, సమస్త శక్తులు, సమస్త ప్రాణులు, సమస్త దేవులు, సమస్త కాలములు, సృష్టి, స్ధితి, లయ, పరమాణువు మొదలు పరమేశ్వర పర్యంతం సర్వ సమిష్టిగ గాంచినపుడే “నేను” బోధపడగలదు. తెలుసుకో… తలుసుకో… కలుసుకో… ఆత్మ విషయంలో తెలుసుకోవటం, దర్శించటం ద్వైతం. ఆత్మ తానని గ్రహించటం అద్వైతం. తానైన ఆత్మయే సర్వ భూతాంతరాత్మ యనెటి ఆత్మౌపమ్య భావనిష్ట నొందుటయే కేవలాద్వైత పూర్ణ స్ధితి. ఇదియే వేదాంతసారం.
ఒకనాడు వేదములు, ఉపనిషత్తులు, తత్త్వ శాస్త్రము, వాస్తు శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము మున్నగు విద్యలు అతి రహస్యంగా ఉంచబడినవి. కొద్దిమంది వేద పండితులు, విద్వాంసులు, సిద్ధాంతుల గుప్పిట్లో బంధింపబడి, వారు ఏది చెబితే అదే వేదంలా చెలామణి అయ్యేది. కాని నేటి కంప్యూటర్ యుగంలో ప్రతి శాస్త్రము బట్టబయలు గావింపబడినవి. ఒకనాడు మునీశ్వరులు ముక్కుమూసు కొని అడవులలో సంవత్సరాలకొద్ది తపస్సు చేసేవారు. కాని ప్రస్తుతం సమాజంలో చాలామంది ధ్యానం, యోగం, వ్యాయామం లాంటి శరీరక, మానసిక ఆరోగ్యప్రదాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, అనేక ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఆత్మోద్ధరణ నిమిత్తం పాటుపడుతున్నారు. మనమూ అదే మార్గంలో పయనించి మన నిజస్ధితిని గ్రహించాలి.
ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గం కొంతమందికే అందుబాటులో ఉండేది. కాని నేడు అధికశాతం ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించి, ఫలితాలను సాధించాలని తాపత్రయపడుతున్నారు. దేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు. ఫ్రతినిత్యం ప్రాత:కాలంలో కొన్ని టి.వి. చానళ్ళు, మరియు సంస్కృతి చానల్ రోజంతా ఆధ్యాత్మిక గురువుల, స్వామీజీల, ఆధ్యాత్మికవేత్తల బోధనలను, దివ్య సందేశములను ప్రసారం చేస్తున్నాయి. నేటికాలంలో దాదాపుగా అన్ని వార్తాపత్రికలు ఆధ్యాత్మిక విషయాలపై విస్తృతమైన సమాచారాన్ని, సమగ్రమైన సందేశాలను అందజేస్తు న్నాయి.
ఆత్మపరిజ్ఞానముపై అభిరుచిగల చాలామంది జిజ్ఞాసువులు వివిధ సాధనా ప్రక్రియలద్వారా ఆత్మదర్శనం చేసుకొని నేను పాంచభౌతిక దేహమును కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడను అనే స్ధితికి రావడం నిజంగా సంతోషించదగ్గ శుభపరిణామం అని చెప్పవచ్చు. వ్యక్తులు, సంస్థలు ఎవరికి వీలున్నపరిధిలో వారు ఆధ్యాత్మిక శిక్షణలనిస్తున్నారు. తమ అధ్యాత్మిక సాధనానుభవాలను గ్రంధరూపంలో ప్రచురించి అనేకమంది జిజ్ఞాసులకు అందజేసి ఆత్మోధరణకై అహర్నిషలు కృషిచేస్తున్నారు. మనవంతు సాధన మనమూ చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మలో లీనమౌదాం.
నాగులవంచ వసంత రావు, సచివాలయం.