Friday, May 30, 2008

గృహస్ధాశ్రమ ప్రాశస్ధ్యం

నిత్యజీవితమును పవిత్రపరచునదే పరమార్ధ వేద విద్య. ఇది గృహస్ధులకు చాలా ముఖ్యం. ఆశ్రమములన్నింటిలో గృహస్ధాశ్రమము సర్వ శ్రేష్టమైనది. ఎందులకనగా గృహస్ధాశ్రమము లేనిచో మిగతా ఆశ్రమాలకు స్ధానం లేదు. సర్వాశ్రమ కూడలి గృహస్ధాశ్రమము. చక్కని గృహస్ధాశ్రమము నుండియే సమస్త మహనీయాత్ములు, అవతారులు ఉద్భవించగలరు.

వివాహము పరమార్ధ జీవనమునకు ఆటంకము కాదని మహా సాధ్వీమణి, ఆదర్శ గృహిణి శ్రీమతి శారదా దేవి నిరూపించినది. భార్యా భర్తలిద్దరు పరస్పరం అవగాహన చేసికొని, శారీరక దృష్టి నతిక్రమించి, మానసికంగా, భౌద్ధికంగా అనంతకాల పర్యంతం విశ్వం కోసం బాహ్యాభ్యంతర బేధం వీడి భగవన్మతులై మెలగు దంపతులు
ధన్యాతి ధన్యులు.

సంసారంలో తొలిఘట్టం వివాహము. అది సార్ధకం, విజయవంతం కావాలనిన ఆ బాధ్యత స్త్రీ పురుషులిరువురిపై ఆధారఫడి ఉంటుంది. అనుస్ఠాన వేదాంతి స్వామి రామతీర్ధ అన్నట్లు “కళ్ళజోడు కంటి చూపునకు అవరోధం కాకుండునట్లు దంపతులిరువురు ఒకరికొకరు భారంగ, భయంకరంగ గోచరించకుండునట్లు చూచుకోవలయును.

హిందువులకు కృత్యాకృత్య విదాయక ప్రమాణ గ్రంధము వేదము. అట్టి వేద ప్రతిపాదిత విధానములన్నియును నివృత్తి బోధకములే. వేదములు మానవులను పాప తాపములనుండి విముక్తులను చేయునిమిత్తమే అవత రించాయి. “వేదో నారాయణ: సాక్షాత్” అనెటి భాగవతోక్తి ప్రకారం వేదం సాక్షాత్ నారాయణ స్వరూపమే.

వివాహ ఆంతర్యం గ్రహించలేనివారు మాత్రమే వివాహాన్ని కామ మయంగా, భోగ విలాస మరియు సంతానోత్పత్తి సాధనంగా భావిస్తారు. కేవలం శారీరక ఆశయములతో, ఇంద్రియ చాపల్య పశువాంచా ప్రవృత్తుల తీర్చుకొను నిమిత్తమేగల దాంపత్యములు హృదయైక్యం కానందున నిప్పులోపడిన ఉప్పువలె చిటపటలతో చివరకు దావాగ్ని వలె చిచ్చున ముంచుట తధ్యం.

ఈ లోకంలో భార్య ఎవరు? భర్త ఎవరు? అవి అస్ధిర శరీర సంబంధములు. ఆత్మకు అవిలేవు. ఆత్మ ఏ లింగబేధంలేని చైతన్య స్ధితి. భర్తయనగా భరించువాడని అర్ధము. “గతిర్భర్తా ప్రభుసాక్షి” యనెటి గీతా శ్లోకానుసారం సమస్త చరాచర జగత్తును ధరించి, యావద్విశ్వమును భరించువాడొక్కడే పరాత్పరమ ప్రభుస్వామియని గ్రహించాలి.

ఉదయాస్తమానము సమస్యలతో సతమతమయ్యే గృహస్ధులు మోక్షమును సాధించుట దుస్తరము, వీలు చిక్కదని కొందరు భావిస్తుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఉదా: జనక మహారాజు చక్రవర్తి పదవి నలంకరించియు తన రాచకార్యములతో పాటు వీలు కలుగజేసుకొని వసిష్ఠ మహర్షి సన్నిధిలో స్ధిరచిత్తుడై కూర్చుండి ఆత్మబోధ విని తరించాడు. అట్టిచో గృహస్ధులకు రాచకార్యములకు మించిన కార్య కలాపములుండవు గదా! ఆలోచించండి! విధిగా తీరిక చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వివాహ సంబంధం శారీరక పరిధుల నతిక్రమించి, నిత్యం పవిత్ర ప్రేమానురాగ బద్ధమై, సౌజన్యంతో, సౌశీల్యంతో, ఆదర్శ కుటుంబముగ, దివ్య గోపురముగ వర్ధిల్లాలి. అప్పుడే చల్లని సంసారం లో చక్కని సంతానం ఉద్భవించగలరు. వారు సీతారాములవలె. రాధాకృష్ణులవలె, పార్వతీ పరమేశ్వరులవలె మెలగి తమ దాంపత్య జీవితాన్ని ధన్యం చేసుకోగలరు.

దంపతులిరువురు సమర్ధులైనచో గృహస్ధాశ్రమ బ్రహ్మచర్యం పాటించవచ్చు. అట్టి కుటుంబములు నిజముగ రాజయోగ మఠములన వచ్చు. గృహస్ధాశ్రమ బ్రహ్మచర్యమనగా కేవలం రుతుకాల సంపర్కమును మాత్రమే కోరుకోవడం. రుతుకాల నిర్ణయము: స్త్రీలకు స్వాభావికముగ పదహారు దినములు రుతుకాలమని శాస్త్రములు చెప్పుచున్నవి. అందులో మొదటి నాలుగు దినములు మంచివికావు. అలాగే పదకొండు, పదమూడవ రాత్రి నిషిద్ధములు. తక్కిన పది రాత్రులు ప్రశస్ధములు. ఏకాదశి, శివరాత్రి మొదలగు పర్వదినములు సజ్జన వర్జితములని శాస్త్ర వచనము. గృహస్ధులు ఈపాటి బ్రహ్మచర్య వ్రతదీక్ష కలిగియున్నను వారు సాధువులే యనవచ్చు. సిం హము మూడు సంవత్రములవరకు బ్రహ్మచర్యం కాపాడుకొని కలువగలదు. ఆందుకే దానికంత పరాక్రమము.

గృహస్ధాశ్రమ బ్రహ్మచర్య రాజయోగ దీక్ష విషయంలో దంపతుల ఒప్పందం ముఖ్యం. పద్మినిజాతి స్త్రీ ఎన్నోరకముల ఉపమానములతో భర్తకు నచ్చజెప్పి తన మార్గంలోకి మార్చుకోగలదు. అలాగే సౌశీల్యంగల పురుషుడు చక్కని శిక్షణచే తన భార్యను ప్రగతిపధంలో నడిపించును. ఏ వంశంలో స్త్రీలు పవిత్రంగ ఆదరింపబడుదురో ఆ వంశమున ఉత్తమ సంతతి జనించును.

“నివృత్త రాగస్య గృహం తపోవనం.” రాగరహితమైన గృహమే పవిత్ర పుణ్యక్షేత్రము. పడవ సముద్రంలో ఉండవచ్చుగాని, సముద్రము పడవలోనికి ప్రవేశించకూడదు. అటులే సంసారంలో మానవుడుండ వచ్చుగాని, మనిషి మనసులో సంసారం ఉండకూడదు. తామర పత్రం నీటిపై, కుమ్మరి పురుగు బురదలో తిరుగునట్లు నిర్లిప్తులై నిలవాలి. నిత్య జీవితంలో గృహస్ధాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ దంపతులు జగతికి ఆదర్శప్రాయులై నిలిచి జీవిత పరమార్ధాన్ని సాధించాలి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Wednesday, May 28, 2008

విశాల దృక్పధం

మానవుడు తన చుట్టూ, తన కుటుంబ సభ్యులచుట్టూ, బంధువులు, స్నేహితులతో ఒక ఆలోచనా వలయాన్ని ఏర్పరచుకుంటాడు. కొన్ని పరిమితులను విధించుకుంటాడు.వ్యష్టి, కుటుంబ వలయం అల్పభావనతో కూడినటువంటిది. తనకు బహుళ ప్రయోజనకారిగా కనిపించినా సమాజపరంగా ఆలోచిస్తే స్వల్ప ప్రయోజనాన్ని కలిగించేటటు వంటిది. అల్ప ప్రయోజనం, సంకుచిత భావననుండి అనంత భావనలోకి, తద్వారా విశ్వభావనలోకి మనస్సును పయనింప జేయడం ఉత్తమ మానవుని ప్రధమ కర్తవ్యం. వ్యష్టి వలయాన్ని క్రమంగా కుటుంబ వలయంగా వ్యాకోచింపజేసి ఆపై ప్రపంచ పరిధిలో విస్తరింపజేసి, చివరికి విశ్వ వలయంగా రూపొందించుకోవాలి.

వ్యక్తి సుఖం కుటుంబ సభ్యుల సుఖంకన్నా స్వల్ప ప్రయోజనం కలిగి నటువంటిది. అందులకే వ్యక్తి తన సుఖాన్ని కుటుంబ సభ్యుల సౌఖ్యం కోసం త్యాగం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. అలాగే కుటుంబ సుఖాన్ని విశ్వ శ్రేయస్సుకోసం త్యాగం చేయాలి. మానవుడు తన అలోచనా విధానాన్ని అంచెలంచెలుగా అనంత భావనవైపు, విశ్వ శ్రేయస్సుకోసం విస్తృతపరుస్తూ ఉండాలి. వ్యష్టి వలయాన్ని విశ్వ వలయం గా విశాలతర మొనర్చి విశిష్టమైన ఆలోచనలతో ఉత్తమ జీవనాన్ని సాగించాలి.

“సంకుచితత్వమే మరణం – విశాలత్వమే జీవనం” అన్నారు స్వామి వివేకానంద. అందులకే మన మనసులను విశాలపరచి విశ్వపర్యంతం విస్తరింపజేద్దాం. వినూత్న శోభతో, ఆదర్శ భావాలతో, సత్కార్యా చరణతో, సద్భావనా స్రవంతులతో, త్రికరణ శుద్ధితో మన మనసును మంచి మార్గంవైపు మళ్ళించుకొని, విశ్వవలయాన్ని నిర్మించుకుందాం. అల్ప దేహ భావనలో చిక్కి, అనంత విశ్వ విరాట్ స్వరూపాన్ని సంకుచిత పరిధిలో ఆలోచించి మన నిజ స్ధితిని మనం మరచిపోతున్నాం. నిద్రాణమై ఉన్న మన మనస్సుకు చైతన్యం రగిలించి విశ్వవ్యాపిత మొనరిద్దాం. విశ్వ తేజోమయులమై దివ్య భావనలతో జీవిద్దాం. మన జన్మలను చరితార్ధం చేసుకుందాం.

నేటి మన మంచి భావనలే బంగారు భవిష్యత్తుకు మూల స్ధంభాలు. అందుకే మన భావనలను ఉదాత్తపరచుకొని, ఉత్కృష్టమార్గంలో పయనింప జేద్దాం. సద్భావనా తరంగాలను విశ్వవ్యాపితం గావిద్దాం. విశ్వమనస్కులమై జీవిద్దాం. వ్యష్టి భావనలో ఉన్నంత వరకు పురోగతి శూన్యం. విశ్వభావనలోనే ఇమిడి ఉంది ఎంతో అభివృద్ధి. మానవుడు తన అభివృద్ధిని తాను చూసుకుంటూ, పక్కవాడి గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించ నేర్చుకోవాలి. మానవుడు తన అనంతమైన దివ్య స్ధితిని మరచి, లోకమాయలో చిక్కి తన చుట్టూ వ్యష్టి వలయాన్ని ఏర్పరచుకుంటున్నాడు. జ్ఞానమనే కత్తెరతో వ్యష్టి వలయాన్ని చేధించి, విశ్వభావనలో పయనించి, విశ్వ వలయంలో జీవించాలి. విశ్వేశ్వర అనుభూతిని పొంది విశ్వపూజ్యులం కావాలి. సకల చరాచర జీవజగత్తులో అంతర్యామిని దర్శించగలగాలి. విశ్వ కుటుంబ భావనతో జీవించనేర్వాలి.

“జగన్మిధ్యా-బ్రహ్మసత్యం.”ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచమంతా ఒక సుదీర్ఘ కలగా, బ్రహ్మ పదార్ధమొకటే సత్యమైనదిగా మనం అనుభూతి చెందాలంటే మనలోని అవిద్యను, అజ్ఞానాన్ని సాధన చతుష్టయంతో పారద్రోలాలి. జ్ఞాన భానుడు మనలో ఉదయించినపుడే అంతర్నిహితంగా దాగివున్న అంతర్యామిని దర్శించ గలుగుతాం. అంతర్ముఖు లమై జీవించ గలుగుతాం. అనంత సచ్చిదానంద స్వరూపాన్ని విశ్వ వలయంలో కాంచగల్గుతాం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

నిన్ను నీవు తెలుసుకో

విశ్వ సృష్టికి మూలం భగవంతుడు. దీన్ని మనందరం ఒప్పుకుంటాం. మనమంతా భగవంతుని బిడ్డలం. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. మనమంతా భగవత్ స్వరూపులం. ఈ మాటనగానే ఒక్కసారి ఉలికి పడతాం. ముఖాలు చూసుకుంటాం. భుజాలు తడుముకుంటాం. మనం భగవంతులం కావటమేమిటని తర్కించుకుంటాం.

జీవునికి దేవునికిగల సంబంధం, తండ్రీ కొడుకులకు గల సంబంధం లాంటిది. తండ్రికి కొడుకుకు జన్యుపరంగా ఎంతో సారూప్యం గోచరిస్తుంది. అలాగే భగవంతునికి మనకు ఎంతో సామీప్యం, సారూప్యమున్నది. అందులకే మనం భగవత్ స్వరూపులం అని తలపోయడంలో తప్పులేదు. ఈ భావన సత్యమని మనకు నిండా నమ్మకం కలగాలంటే, మనలోని అహంకారన్ని పూర్తిగా తొలగించుకోవాలి. క్షుధ్ర దేహాభిమానాన్ని వదలుకోవాలి. దేహభావన, అహంకారం ఉన్నంతవరకు ఆత్మ జ్ఞానం చిక్కదు, దైవ దర్శనం కాదు. నిన్ను నీవు పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవాలి. అప్పుడే మనకు దైవానుభూతి కలుగుతుంది. పరమేశ్వరునియొక్క విభూతి తత్త్వం గ్రాహ్యమౌతుంది.

ఈ లోకంలో మనం ఎన్ని చదువులు చదివి, ఎన్ని డిగ్రీలు, పిహెచ్.డి.లు సంపాదించినా, ఎన్ని కొత్త విషయాలను కనిపెట్టినా, ఎన్ని ఘనకార్యాలు చేసి గిన్నీస్ బూక్ లోకి పేరు ఎక్కినా నిన్ను నీవు తెలుసుకోనట్లైతే ఆ చదువులకు అర్ధం, పరమార్ధం లేదు. అందులకే చదివి చదివి చచ్చేదాని కన్న, చావని బ్రతుకని చదువు చదువ నేర్చుకోవాలి. ద్రవ్య జ్ఞానముతో పాటు దైవ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. దైవ భావనలో సదా నిలిచిపోవాలి.

నిన్ను నీవు నిండా తెలుసుకున్నట్లైతే నీ స్వరూపమే పూర్తిగా మారి పోతుంది. నీలో జ్ఞాన తరంగాలు వెల్లివిరుస్తాయి. నీ మాటల్లో, చేతల్లో, భావంలో చైతన్యం ఉరకలు వేస్తుంది. నీలో నిర్భయత్వం చోటు చేసుకుంటుంది. 60 లో 20 సం.ల ఉత్సాహం, 20 లో 60 సం.ల వైరాగ్యం పుట్టుకొస్తుంది.

స్వస్వరూప సంధాన స్ధితియే మోక్షం. నీలో నీవు రమించినపుడే పరమానందం. నీ నిజస్ధితిని తెలుసుకొనకుండుటకు మించిన ఘోర పాపం మరొకటిలేదని శాస్త్రాలు సెలవిస్తున్నాయి. నిన్ను నీవెరింగిన నీవే నిజ దైవం. నీకు మొక్కోటి దేవతలమీద నమ్మకమున్నా, నీ మీద నీకు నమ్మకం లేనట్లైతే ముక్తి శూన్యం. అందులకే నేను దేహం కాదు, ఆత్మ స్వరూపాన్ననే భావనకు రావాలి. అప్పుడే సర్వం బట్టబయలు కాగలదు. సర్వం నీలో లయించిన అనుభూతి చిక్కుతుంది. చిక్కిన అనుభూతిని చక్కగా కాపాడుకొని చిన్మయ భావంలో జీవించాలి. ఇహమేవ! ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలోనే ముక్తి సాధనకు ప్రయత్నం చేద్దాం. ముక్తికాంతను వరిద్దాం. ఆనంతాత్మ సాగరంలో మునిగి తేలుగాం. జీవన్ముక్తుల మౌదాం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Tuesday, May 27, 2008

నీలో శక్తిని గుర్తించు

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అద్భుత శక్తి అంతరాంతరాల్లో అణగి మణగి ఉంటుంది. ఏ మనిషీ ప్రతిదాంట్లోనూ సమర్ధుడు కాడో, ఏ వ్యక్తీ ప్రతి విషయంలోనూ అసమర్ధుడు కాడు. అతి సాధారణ స్ధాయిలో ఉన్న వ్యక్తిలోనైనా, అసామాన్యమైన శక్తి సామర్ధ్యాలుంటాయి. ఆ శక్తిని తెలుసుకోనంతకాలం ఎవెరైనా ఎదుగూ బొదుగూ లేకుండా, ఏమాత్రం అభివృద్ధి చెందకుండా అలాగే ఉండిపోతారు. ఐతే తనకు తెలియ కుండానే తనలో దాగివున్న అనంత శక్తిని తెలుసుకున్న నాడు, ప్రేరణను పొందిననాడు అనూహ్యమైన మానసిక మార్పు సంభవించి అద్భుతమైన అభివృద్ధిని సాధించగలడు.

ఆ శక్తిని మనకు ఎవరో ఇచ్చేది కాదు. మనం పుచ్చుకునేది కాదు. మనంతట మనం సాధనచేసి సాధించుకోవాలి. దీన్ని సాధించిన నాడే మనం మన గమ్యాన్ని చేరుకో గలుగుతాం. మన ధ్యేయం, లక్ష్యం దిశగా దూసుకుపో గలుగుతాం. హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదు. కొండలనైనా పిండిచేయగల సత్తా, సముద్రాన్ని ఒక్క అంగలో దాటగల సమర్ధత, పెను వృక్షాలను పెకలించగల శక్తి, పర్వతాలను అరచేత్తొ పైకెత్తగల సామర్ధ్యం తనలో నిక్షిప్తమై ఉన్నాయని తెలుసు కున్న తరువాతే సంజీవినీ పర్వతాన్ని అరచేత్తో తీసుకురాగలిగాడు.

లక్ష్యాన్ని సాధించాలంటే, గమ్యాన్ని చేరుకోవాలంటే మన ప్రయత్నంలో అత్యంత తీవ్రత, విషయంలోకి లోతుగా వెళ్ళే స్వభావాన్ని అలవర్చుకోవాలి. సముద్రం పైపైన వెదకినట్లైతే మనకు ముత్యాలు దొరకవు. ముత్యపు చిప్పలు దొరకాలంటే సముద్రపు అట్టడుగుకు చేరు కోవాలి. పిచ్చికుక్క కాటువేస్తే సంక్రమించే భయంకర రేబిస్ వ్యాధి నాశనానికి వాక్సిన్ కనుగొన్న లూయీ పాశ్చర్ కి తనలో గొప్ప పరిశొధకుడు దాగున్నాడని, మానవాళి శ్రేయస్సు కోసం ఎన్నో వాక్సిన్ లను కనుగొనగల శక్తి తనలో దాగుందని ఆయన శ్రీమతి తెలియజేసే వరకు ఆయనకు తెలియనే తెలియదు.

లూయీ పాశ్చర్ 1849 లో మేరీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మానవాళిపట్ల మృత్యు దేవతగా నిలిచిన రేబిస్ వ్యాధికి మందు కనుగొనాలన్న దృఢమైన సంకల్పం, పట్టుదల ఆయనలో ఉండేది. తన మనసులోని మాటను పెళ్ళయ్యాక భార్యకు చెప్పి ఆ మందు కనుగొనటం తనవల్ల కాదని, తనకన్ని తెలివితేటలు లేవని, మరో పరిశోధకుడి సహాయంతో పిచ్చికుక్క కాటుకి వాక్సిన్ కనుగొనాలనే ఆలోచనను భార్యముందు ఉంచాడు. అప్పుడు అతని భార్య “మీ శక్తి ఏమిటో మీకు తెలియదు, వాక్సిన్ కనుగొనడానికి మరొక పరిశోధకుడి అవసరం ఏమాత్రం అక్కరలేదు, మీరొక్కరే వాక్సిన్ కనుగొనగలరు, ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది” అని చెప్పింది. అప్పుడు తెలిసివచ్చింది పాశ్చర్ గారికి తనలోని శక్రి సామర్ధ్యాలేమిటో. ఆ రోజునుండి ఎన్నో పరిశోధనలు చేసి తన ప్రాణాలను ఫణంగా పెట్టి అప్పట్లో ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధికి వాక్సిన్ కనుగొని మానవాళి రేబిస్ మృత్యు కోరల బారిన పడకుండా రక్షించగలిగాడు.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Monday, May 26, 2008

నారదుడి సంసారమోహం

మాయ ఇలాంటిదని తెలియరానిది. ఓకరోజు నారదుడు శ్రీహరిని సమీపించి “స్వామీ! అసాధ్యాన్ని సుసాధ్యంచేసే నీ మాయను నాకు చూపించు” అని వేడుకొన్నాడు. శ్రీహరి తల పంకించాడు. ఆ తరువాత ఒకరోజు శ్రీహరి నారదుణ్ణి వెంటబెట్టుకొని ఒకానొక చోటికి ప్రయాణమైనాడు. కొంత దూరం వెళ్ళాక శ్రీహరికి దాహమైంది. ఎంతో అలసి కూర్చుండిపోయి, “నారదా! నాకు చాలా దాహం వేస్తోంది. ఎక్కడికైనా వెళ్ళి కొంచెం మంచి నీళ్ళు పట్టుకురా” అన్నాడు. నారదుడు వెంటనే నీళ్ళు వెదకడానికి బయలుదేరాడు.

సమీపంలో ఎక్కడా నీటి చుక్క లేదు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏరు ఒకటి ఉన్నట్లు కనిపించింది. నారదుడు ఆ ఏటివద్దకు వెళ్ళగానే అక్కడొక దివ్య సుందరాంగి కనబడింది. ఆమె సౌందర్యాన్ని చూసి నారదుడు మోహం చెందాడు. ఆమె సమీపానికి పోగానే, మృదు మధుర వాక్కులతో ఆమె నారదుణ్ణి పలుకరించింది. అచిరకాలంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. నారదుడు ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చెయ్యసాగాడు. కాలక్రమాన ఆమెవల్ల అతడికి సంతానం కలిగింది.

ఇలా నారదుడు ఆలుబిడ్డలతో మహానందంగా కాలం గడుపుతూంటే, ఆ దేశంలో గొప్ప కరువు కాటకం సంభవించింది. వేలకొద్ది జనాన్ని మృత్యువు కబలించసాగింది. అప్పుడు నారదుడు ఆ చోటు విడిచి మరోచోటుకి పోవటం మంచిదని భార్యతో అన్నాడు. భార్య కూడా సమ్మతించగా వారిద్దరూ వంతెనమీదుగా పోతూంటే హఠాత్తుగా పెద్ద వరద వచ్చింది. ప్రవాహ వేగంలో పిల్లలంతా ఒక్కొక్కరే కొట్టుకు పోయారు. చివరకు భార్యకూడా నీళ్ళలో మునిగిపోయింది. అపరిమిత దు:ఖంతో నారదుడు నది ఒడ్డున చతికిలబడి భోరున విలపించసాగాడు!

ఆ సమయంలో శ్రీహరి అతణ్ణి సమీపించి, “నారదా! మంచి నీళ్ళు ఏవి? నువ్విలా ఏడుస్తున్నావెందుకు?” అంటూ పలుకరించాడు. స్వామిని చూడగానే నారదుడు ఉలిక్కిపడి లేచాడు.జరిగిపోయినదంతా నారదుడికి తేటతెల్లమైంది. అప్పుడు నారదుడు చేతులు జోడించి “మహాప్రభో! నీకు పదివేల నమస్కారాలు! అత్యద్భుతమైన నీ మహామాయకు శతకోటి నమస్కారాలు!” అని శ్రీహరితో అన్నాడు

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Sunday, May 25, 2008

భక్తి మార్గం

ముక్తిని సాధించుటకు అనేక మార్గములు గలవు. అందులో భక్తి మార్గము అత్యంత సులువైనది. భగవంతుని నామాన్ని జపిస్తూ, రూపాన్ని ధ్యానిస్తూ చేసే పూజలను, ఉపాసనలను భక్తి అంటారు. భక్తి యోగంలో జీవుడు దేవుని ఎల్లవేళలా స్ధుతిస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు.

భక్తి యోగం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. “ప్రప్రధమమున మనస్సును, బుద్ధిని పరమాత్మయందు స్ధిరముగ నిలుపవలెను. మనస్సు సంకల్పించును. బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవంతుని విషయమై దృఢమగు నిశ్చయమును కలుగజేయునది బుద్ధియే. కావున దానిని కూడ మనస్సులో చేర్చవలెను. అట్లు మనో బుద్ధుల రెండింటిని ఇతరమైన దృశ్య వస్తువులయందు ప్రవేశింపనీయక, ఒక్క భగవంతునియందే లగ్నమై యుండు విధముగా ప్రయత్నింపవలెను. అట్లు చేసినచో భక్తుడు ధ్యేయ వస్తువగు ఆ పరమాత్మయందే సదా నివసింపగలడు. ఉప్పు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించునో, దేనియందు సంలగ్నమై యుండునో దాని యందే లయించి తదాకారమగును. కావున ఎల్లప్పుడు భగవంతునియందు స్ధిరముగ ఉండునట్టి మనస్సు క్రమముగ ఆ దైవాకారమునే పొందును. అదియే మోక్షము”.

మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము కలుగుచున్నవి. కాబట్టి మనస్సును ఏదొ ఒక విధముగ భగవంతునియందు నిలుపవలెను. మనస్సు నిలువనిచో దానిని ఏదో ఒక విధముగ నిలుకడ పొందునట్లు చేయ వలెను. మోక్షము పొందుటకు ఇంతకంటె వేరు మార్గము లేదని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు.

మనో నిశ్చలత్వమును సాధించలేని వారు క్రమముగ దైవ కార్యములయందు, పరోపకార క్రియలయందు ఆసక్తి కలిగి, వానిని నిష్కామముగ ఆచరించుచు రావలయును. జపము, ప్రార్ధన, కీర్తన, భజన, పూజ, వ్రతములు మున్నగు వానిని భగవంతుని ప్రీత్యర్ధము గావించుచుండవలెను. దానిచే మనస్సు శుద్ధము కాగా క్రమముగ జ్ఞానముదయించి మనుజుడు మోక్ష సిద్ధిని పొందగలడు. ఆతి సూక్ష్మమైన మనస్సును, సంకల్పములను అరికట్టలేని వారికి యీ కర్మ మార్గము అతి సులువైనదని భగవానువాచ.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

జీవిత పరమార్ధం

అనంత కాలచక్రంలో జీవితకాలం అల్పంగా గోచరించినప్పటికి, అర్ధం చేసుకోగల శక్తి ఉంటే శతకోటి సుగంధ పరిమళాల మాల మానవ జీవితం. ఉత్సాహంగా పనిచేస్తూ, ఆనందంగా జీవిస్తూ, సాటివారికి సాయంచేస్తూ బ్రతకడమే నిజమైన జీవితం. సద్భావనలు సంతరించుకొని సన్మార్గాన పయనిస్తూ, సమత మమత మానవతలను పరిఢవిల్లజేసేదే జీవితం. ఆదర్శాలను ఆచరణలో ప్రతిబింబిస్తూ, తెరచిన పుస్తకంలా ఉండేదే అసలైన జీవితం.

దురలవాట్లతో దిగజార్చు కుంటే జీవితం దు:ఖ సాగరమౌతుంది. మలచుకోగల నేర్పు ఉంటే మహోన్నత శిఖరమౌతుంది. సంసార సాగరం లో సమస్యల తిమింగలాలు అలజడులు రేపి అల్లకల్లోలాలు సృష్టించినా, సుడి గుండాలుగా మారి సునామీలా విరుచుకుపడినా, మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మనగలిగేదే జీవితం. ఆదర్శాలను ఆచరణలో అమలుచేయబోతే సహించలేని సభ్య సమాజం తూలనాడినా, అభాండాలువేసి అభాసుపాలు చేసినా, గుండెనిబ్బరంతో ముందుకు సాగేదే జీవితం.

నీవు నమ్మిన సిద్ధాంతాలతో ఎవరూ ఏకీభవించకున్నా, అవి అంతరాత్మ ప్రభోదానికి అనుగుణంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా ఏకమై ఎదిరించినా, నిందించి నీరుగార్చినా, అహర్ణిశలు ఆత్మోన్నతికి శ్రమించడమే అసలైన జీవితం. మనసును నియంత్రించి, అరిషడ్వర్గాలను జయించి, అనునిత్యం ఆత్మానందంలో మునగడమే దివ్య జీవనం. గర్వమే సర్వ అనర్ధములకు మూలం, అహంకారం నశిస్తేనే ఉదయిస్తుంది ఆత్మ జ్ఞానం.

“బలమే జీవనం – బలహీనతే మరణం” అని చాటిన స్వామి వివేకా నందులవారి సిమ్హ గర్జనకు స్పందించి, పరిపూర్ణమైన ఆరోగ్యంతో, మానసిక వికాసంతో, విశాల హృదయంతో వర్తించగలిగేదే విలువైన జీవితం. బహుజన్మల పుణ్యపాక వశాన భగవంతుడిచ్చిన వరం మన జీవితం. 84 లక్షల జీవరాసులలో ఉత్కృష్టమైనది మానవ జన్మ. అందులకే విషయ వాసనలను విసర్జించి, స్ధితప్రజ్ఞతను సాధించి, ఆత్మ జ్ఞానాన్ని అనుభూతి చెందినదే సంపూర్ణ జీవితమని శాస్త్రాలు సెలవిస్తున్నాయి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

దివ్యుడా! కనువిప్పుకో!!

ఓ ఆత్మ వీరుడా! అజ్ఞాన దశనుండి మేల్కొని సకల జీవరాసులలో సర్వేశ్వరుని దర్శించ నేర్వమని వేదాలు ఘోషిస్తున్నాయి. మానవుడు మాయలోపడి పరమేశ్వరుని మరచి ఏవిధంగా ప్రాపంచిక జీవన యానం సాగిస్తున్నాడో శాస్త్రాలు సెలవిస్తున్నాయి. బుల్లి బుల్లి నడకలతో బాల్య్లం గడచిపోతుంది. చిట్టి చిట్టి మాటలతో చిరుప్రాయమంతా కరగిపోతుంది. యవ్వన దశకు చేరగానే ఇంద్రియాల వత్తిడివల్ల ఎండమావిలాంటి కామ వాంచను తీర్చుకోవడానికి వడివడిగా పరుగెడుతాడు. సుందరమైన దేహ సౌందర్యానికి దాసుడై చిందులేస్తూ అంతరాత్మ ప్రభోదాన్ని సైతం ధిక్కరిస్తాడు. మనసులో విషము నింపుకొని సైతం పెదవులపై ప్రేమ ఒలకబోస్తూ కపట జీవితాన్ని కొనసాగిస్తాడు. అహంకారప్రవృత్తిలో అన్నుమిన్ను తెలియక నాదే పైచేయని దర్పాన్ని ప్రదర్శిస్తాడు.

ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడున్నాడనే సత్యాన్ని గ్రహించలేక ప్రతిమ లను పూజిస్తూ ప్రాణులను హింసిస్తూ ఉంటాడు. బలం బాగా వస్తుందని జీవులను చంపి తింటాడు. కాని కాళుడు కన్నెర్ర జేసినప్పుడు చతికిల బడక తప్పదనే విషయాన్ని గ్రహించలేకపోతాడు. సత్త్వ, రజో, తమో గుణములనెటి త్రిగుణములలో చిక్కి ఎన్నో బాధల ననుభవిస్తూ, మాయ చేత పెడతన్నులు తింటూ ఉంటాడు.

కాబట్టి ఓ మానవా! కాలమంతా కరిగిపోతూ ఉంది. నీ వయసేమో రోజు రోజుకు తరిగిపోతూ ఉంది. మృత్యువు క్షణ క్షణం దగ్గరవుతూ ఉంది. ఐనప్పటికి నీకు మాత్రం బ్రతుకుపై ఆశ చావడంలేదు. మృత దేహాన్ని చూడగానే “ఈ రోజు ఇంట్లో – రేపు మంట్లో” అంటూ అంతులేని వైరాగ్యాన్ని ప్రదర్శించి, స్మశానం నుండి బయటికి రాగానే మాయావినోదంలో మునిగి పోతున్నావు.

మాట విననటువంటి మనసుతో సాంగత్యం చేసి, మాయలో చిక్కుకొని మానవ జన్మ పరమార్ధమైన ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనే విషయాన్ని మరచిపోయావు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో కర్మఫలానుసారం వివిధ శరీరాలను ధరించి, బహు జన్మల పుణ్యపాక వశాన మానవ జన్మ ఎత్తావు. ఇకనైనా కనువిప్పు కలిగించు కొని ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి, జనన మరణ కాలచక్రం నుండి విడుదలై మోక్షం పొందాలని పురాణాలు బోధిస్తున్నాయి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Saturday, May 24, 2008

సరళ వాక్కు

మనం తీసుకునే ఆహారాన్నిబట్టి ఆలోచనలు, ఆలోచనను బట్టి సంభాషణలు ఉంటాయి. జిహ్వచాపల్యంచేత రజోగుణ భూయిష్ట మైన మాంసాహారమును భుజించినచో కామ క్రోచములు ప్రకోపించి నాలుక వశముదప్పే ప్రమాదము కలదు. శుద్ధ సాత్వీకాహారమును మాత్రమే తీసుకున్నట్లైతే మనస్సు మన ఆధీనంలో ఉంటుంది.

అన్నపు సూక్ష్మాంశమే మనస్సు కాబట్టి మనం తీసుకునే అహారం మీద, మంచి ఆలోచనలమీద మన మనస్సు ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం రుచిగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉండాలి. అప్పుడే మనకు ఉత్కృష్టమైన ఆలోచనలు, ఉదాత్త మైన భావాలు కలుగుతాయి. ఆ భావాలను అలా అలా ఉదాత్తం చేస్తూ, ఉద్దీపన గావిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. పరుష వాక్కులు మన నాలుకలపై దొర్లకుండా జాగ్రత్తపడవచ్చు. కటువైన మాట ఎదుటివారి మనస్సును గాయపరచి, చిత్రవధ చేస్తుంది.

మంచి మాటలతో ఎన్ని పనులైనా సాధించవచ్చు. నోరు మంచిదైతే ఊరుమంచిదంటారు. మన మాటమీదే మనకు లభించే గౌరవం ఆధారపడి ఉంటుంది. మాటలో మృదుత్వం, చేతలో నైపుణ్యం, వ్రాతలో పటుత్వం ఉండాలి. లేకుంటే మనలను ఎవ్వరూ లెక్కచేయరు. ఎవరూ మనలను గుర్తించి, గౌరవించరు. ఫదిమందిచేత గుర్తింపు పొందాలంటే, గౌరవాన్ని సంపాదించుకోవాలంటే, మన మాట రామ బాణంలా ఉండాలి. ఎదుటివారి హృదయంలో మళయమారుతంలా చొచ్చుకుపోవాలి. మన మాట ఎదుటివారిలో పరివర్తన తీసుకు రాగలిగినదిగా ఉండాలి. అందుకే మన మాట ఎప్పుడూ సరళంగా, సవ్యంగా, దివ్యంగా ఉండాలి. అపసవ్యపు మాటలు మన నాలుక దరిచేరకుండు గాక! సదా సరళ వాక్కులే మన నాలుకపై నర్తించునుగాక!

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

మత సామరస్యం

ఈ లోకంలో కులముల పేరిట కుమ్ములాటలకన్న మతముల పేరిట జరిగిన అల్లకల్లోలాలు, రక్తపాతాలు, మారణహోమాలు మిన్న. ఈ దోషం ఎక్కడుంది? మతములోనా, మనిషిలోనా? ఇంగిత జ్ఞానం లేనపుడు మనిషిని ఏ మతము ఉద్ధరించదు. ఎవరికి వారు తమ మతాలతో తాదాత్మ్యం చెందినట్లు ఇతర మతాలతో తాదాత్మ్యం చెందలేక పోవటమే సమస్త అనర్ధములకు మూలం.

దుర్మతాంధులకు తమ మతము తప్ప ఇతర మతములు గోచరించవు. అన్యమతాలు అసలు మతాలే కావని, వారిదే సరియైన మతమని వాదిస్తారు. నిలదీసి అడిగితే వారి మతములోని ఆంతర్యమే వారికి తెలియదు. స్వమత విజ్ఞాన శూన్యతే పరమత ద్వేషానికి కారణం. ఒక మతములో పుట్టి పెరిగిన వారికి ఆ మత భ్రమలో అంతయు తెలిసినట్లు
ఉండెదరు. తన మతంతో ఎక్కువ పరిచయం ఉన్నందున విశేషాంశము లు అతని దృష్టిపధమున నిలువవు.

ఇక మరికొందరికి తమ మతమే మహోన్నతమైనది, సత్యమైనది, మిగతా మతములు భూటకములని, మా మతములో చేరిననే తప్ప స్వర్గ రాజ్య ప్రవేశము లేదని భ్రమించెదరు. ఇది మరీ సంకుచిత దృష్టి. నీ విశ్వాసము నీకెంతో ఎదుటివారి విశ్వాసం వారికంతే. నీ దృష్టిలో ఎదుటివారినెలా భావిస్తున్నావో, వారి భావన నీ విష యంలో అంతే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలనిన మతములన్నియును అసంపూర్ణములు. కేవలం సంపూర్ణ దైవమతమే కాలాతీతం, సర్వ జనులకు ఆదర్శప్రాయమైనది. సమస్త మతములు దీని శాఖలు.

నీలో శక్తి ఉన్నచో ఏ మతము స్వీకరించకుండా ఉండు. ముందు నీ మతి భ్రమణము నరికట్టుకో. నీవనగా ఏమిటి? నీ నిజస్ధితిని తెలుసుకో. నిన్ను నీవు అర్ధం చేసుకో! నీవు ప్రకృతి దాసుడవు కారాదు. లే! నీకు నేవే లక్ష్యం, కేంద్రం కావాలి. ఆధ్యాత్మిక పరిభాషలో దీనిని స్వనిష్ట అంటారు. దుర్మత మౌఢ్యం అంతరించు గాక! దృక్పథములో మార్పు రాకుండా ఎన్ని మతములు పట్టినా వృధా శ్రమయే మిగులుతుంది. మతాలను లోతుగ అధ్యయనం చేస్తే అన్నింటిలో అంతేనని తెలుస్తుంది.

మతం అంటే ఏమిటి? మతి పరిధిలో నిలుపుకొన్న విశ్వాసాలకే మతమని పేరు పెట్టుకున్నాం. ఏ మతముతో సంభంధం లేకుండా నైనా ఉండాలి లేదా సర్వమత సమన్వయ దృక్పధము కలిగి మెలగాలి. మీకిష్టమైన, నచ్చిన ఏ మత పరిధిలోనైనా ఎదగండి కాని ఏ ఇతర మతములను దూషించరాదు. సర్వమత సామరస్య హృదయులు కావాలి. మత గ్రంధాలలో ఏమి చెప్పిన వాటిని శిరసావహించి ఆచరించ వలసిందేగాని ప్రశ్నించ వీలులేదనటం అధికార మత వాదం. హేతువునకు నిలబడిన వాటినే స్వీకరించాలనేది మానవతా వాదం. సర్వ మతాలను తనలో కలుపుకొను సామర్ధ్యం గలవారు ధన్యులు. అలాగే సర్వ మతాలలో తాను కలిసిపోగలగాలి.

సైన్సుతో లౌకిక జ్ఞానం పొంది లౌకిక భద్రతను, మతముతో పరలోక భద్రతను పొందనేర్వాలి. సైన్సుకు ఇతరమైనది లేదనుకోరాదు. ఆధారం లేకుండ ఆధేయం నిలువలేదు. ప్రతి దానికి ఒక ఆధారం కలదు. సర్వాధారుడవై నీవున్నావనెటి స్వరనాధం వినండి. ఒక్క మాటలో చెప్పాలనిన మతి ఉన్నంతవరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మతం ఉన్నట్లే. స్వభావ సిద్ధమైనదంతయు వారల పాలిట మతములే కాగలవు. నిజమైన మతం బాహ్య రూపాలలో లేదు. మనో దృక్పధములో, సరిహద్దులకు బద్ధమై లోక మతములు కలవు.

మతానికి, అంతర్గత విలువలకు సంబంధం గలదు. ప్రతి మతానికి పారమార్ధిక విలువ ఉండాలి. చిక్కంతా ఇక్కడే గలదు. మత విధానాలు పారమార్ధిక విలువలను సాధించి పెట్టగలవనే నమ్మకం కుదురాలి. చిత్తశుద్ధిని కలిగించి, ఆత్మజ్ఞాన ప్రభావితుని చేసే మతమేదైనా ఉన్నచో దానిని అనుసరించవలయును. ఈ స్ధితిలో వ్యక్తికి వేయి మతములున్నా దోషంలేదు. ఏ మతానికైనా విశ్వాసం ప్రాతిపదిక.

మతం వ్యక్తి వికాసాన్ని, దృక్పధాన్ని ప్రభావితం చేయాలి. మానవుని హృదయాన్ని విశాల భావాలతో వ్యాకోచింపజేసి విశ్వేశ్వర దర్శనం కలిగించాలి. విశ్వకళ్యాణానికి రాచబాటలు వేయాలి. శర్వజనుల శ్రేయస్సును కాంక్షించునదే నిజమైన మతం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Friday, May 23, 2008

దైవమంటే ఏమిటి?

మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తాం. మనసు నిలకడకోసం ఒక విగ్రహాన్నో, చిత్రపటాన్నో ఎంచుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తాం. గతంలో అవతరించిన అవతార పురుషులను, ప్రస్తుతం సజీవులైన మహాత్ములను, బాబాలను, స్వాములను, అమ్మలను మనం పూజిస్తున్నాం. ఐతే దైవమంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు దేవుడనగా అకాశములోగాని, పాతాళములోగాని, పరలోకములోగాని, విగ్రహములోగాని, దేవాలయములోగాని, మరి ఏ ఇతర నిర్దేశిత ప్రదేశం లో గాని ప్రతిష్టించబడియున్న “స్పెషల్ ఎఫెక్ట్స్”తో కూడిన అద్భుత శక్తి కాదు. సకల చరాచర జీవజగత్తులో నిండి, నిబిడీకృతమై వున్న అనంత చైతన్య స్వరూపమే అసలైన దైవం.

మన తాతలు, తండ్రులు, దేవుని విగ్రహాలకు, చాయా చిత్రాలకు దండం పెట్టారు. మనమూ అదే బాటలో దండాలు పెడుతున్నాం. రాముడు, కృష్ణుడు, ఏసు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, షిరిడీ సాయి మొదలగు వారిని దేవుండ్లంటున్నాం. వారిని పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం.
బాగా ఆలోచించి, విశ్లేషణ చేసుకుంటే మనం దేవుని పటానికి దండం పెట్టినంత మాత్రాన మోక్షం పొందలేము. అదెలాగంటే ధనవంతుని అమితంగా గౌరవిస్తే, శక్తిమేర పొగిడితే ధనవంతులం కాలేం. ఎంతో నేర్పుతో కష్టపడి పనిచేస్తే, దానికి అదృష్టం తోడవుతేనే మనం ధనవంతులం కాగలం. అలాగే దైవ లక్షణాలను అలవర్చుకొని, నిత్య జీవితంలో చక్కగా ఆచరణలో పెడితే దేవునిలాగ అవుతాం. అందుకే దేహేంద్రియ మనోబుద్ధుల నతిక్రమించి, దేహాభిమానాన్ని దూరం చేసుకొని, దైవభావనలోకి ప్రవేశించినట్లైతే మనం జీవన్ముక్తులమౌతాం. అందుకే మనో నిగ్రహాన్ని పాటించి, ధ్యాన మార్గాన్ని అనుసరించి మన నిజ దైవస్ధితిని తెలుసుకుందాం. దైవ భావన లో సదా నిలిచి ఉందాం.

లౌకికపరంగా గనక చూసినట్లైతే ఒకరు పరిశ్రమలో కార్మికుడుగా చేరి, తన శక్తియుక్తులను ప్రదర్శించి పారిశ్రామికవేత్త అవుతున్నాడు. మరొకరు షెడ్డులో మోటార్ మెకానిక్ గా చేరి నిరంతర శ్రమతో అనతికాలంలోనే షెడ్డుకు యజమాని అవుతున్నాడు. ఇంకొకరు హోటల్లో సాధారణ సర్వర్ గా చేరి కొద్ది కాలంలోనే తన నైపుణ్యాన్ని ప్రదర్శించి హోటల్ యజమాని స్ధాయికి ఎదుగుతున్నాడు. ఇవన్నీ సంతోషించ దగ్గ పరిణామాలే. కాని మన నిజస్ధితి విషయానికొచ్చేసరికి మనం ఎల్లప్పుడు కంటికి కనిపించని, మనసుకు అనుభూతికాని దేవునికి దండాలు పెట్టే స్ధితిలోనే ఉంటున్నాం. మూర్తి పూజలు భక్తి మార్గంలో పరిపాటి అయినప్పటికీ, జ్ఞాన మార్గంలో అవి అక్షరమాలలో మొదటి అక్షరం మాత్రమేనని తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం వర్ణమాల పూర్తిగా నేర్చుకునేదెప్పుడు? గ్రంధపఠన చేసేదెప్పుడు? డిగ్రీలు, పిహెచ్.డీ.లు పొందేదెప్పుడు? మన నిజ దైవస్ధితిలో అనగా స్వస్వరూప సంధాన స్ధితిలో ఓలలాడేదెప్పుడు?

అందుకే ప్రస్తుతం మనమున్న స్ధాయినుండి ఒకడుగు ముందుకు వేద్దాం. మనలో దాగివున్న దైవత్వంపై అచంచలమైన విశ్వాసంతో, భక్తి మార్గంలో పయనించి, ముక్తికి చేరువై, జీవన్ముక్తులమై దివ్యజీవనం సాగిద్దాం. మానవులందరు దేవుని సంతానమన్నది నిర్వివాదాంశం. దేవుని పుత్రులు, పుత్రికలకు దైవ లక్షణాలు అనివార్యం. మనస్సు మాయలో చిక్కుకున్నందువల్ల మన నిజస్ధితిని మరచిపోయాం. నివురుగప్పిన నిప్పువలె నిజస్ధితిని మరిచి జీవిస్తున్నాం. ఒక్కసారి నిప్పుకణక మీది నివురు (బూడిద)ను ఊదేద్దాం. మనలో నిద్రాణంగా దాగివున్న దైవత్వాన్ని వెలికితీద్దాం. దైవానుభూతిని సాధించి దివ్యజీవనం సాగిద్దాం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Friday, May 9, 2008

కీర్తి ప్రతిష్టలు

ఉత్కృష్టమైన జ్ఞాన మార్గంలో కీర్తి ప్రతిస్టలకు అంతగా ప్రాధాన్యత లేదు. కాని సామాన్య మానవ జీవితానికి కీర్తి ప్రతిస్టల అవసరం ఎంతైనా ఉంది. కనీసం వాటికోసమైనా దాన గుణమును అలవరచుకునే అవకాశం లభిస్తుంది. వారి పెద్దల పేరుమీద విద్యాలయాలు నడపడం, వైద్య శాలలు నెలకొల్పడం, ఉచిత సత్రములు కట్టించడం, అన్న దానం వంటి సేవా కార్యక్రమాలు ఈ కోవలోకి వస్తాయి. తద్వారా మానవుడు మానసిక స్ధాయిని విశాల పరచుకొని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకొంటాడు. తన కుటుంబ గౌరవాన్ని, వంశ పేరు ప్రతిస్టలను కాపాడుకోగల్గుతాడు.

కేవలం డబ్బు మాత్రమే కీర్తి కిరీటాలను అందించగలదనుకోవడం అత్యాశే అవుతుంది. సుఖ సంతోషాలతో బ్రతకడానికి డబ్బు అవసరమే. లెక్కకు మిక్కిలి ఆస్తిపాస్తులు సంపాదించినంత మాత్రాన ప్రపంచం తనను అభినందిస్తుందని, గౌరవిస్తుందని భావించడం దురాశే అవుతుంది. అపరిమితమైన సంపదను కూడబెట్టే ప్రయత్నంలో మనకు తెలియకుండానే ఎందరో శత్రువులు ఏర్పడతారు. మనిషికి కోరికలు ఎక్కువై అరిషడ్వర్గాల బారిన పడతాడు. సాటివారు మనల్ని చూసి ఈర్ష్య పడతారు. ప్రక్కవారు, ఎదుటివారు మన అపార సంపదను చూసి “తప్పుడు మార్గంలో సంపాదించి ఉంటాడు – లేకపోతే ఇంతలోనే అంత ఎలా సంపాదించ గలుగుతాడు” అంటూ సూటిపోటి మాటలంటారు.

న్యాయసమ్మతంగా, ధర్మ బద్ధంగా ఆర్ధికంగా ఎందగడంలో తప్పులేదని పెద్దల ఉవాచ. దానితోబాటు సంపాదించిన ధనాన్ని అర్హులైన వారికి దానం చేస్తే కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. దాన ధర్మాల్లాంటి మంచి పనులు చేసి మానసికానందాన్ని దండిగా పొందాలి. కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పటికన్నా – మీ వలన ఏదో మేలుపొందిన వ్యక్తి మనసారా అభినందించి, కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తున్నప్పుడో – లేక ఈ సమాజం మీ మంచితనాన్ని గుర్తించి మీకు ఘన సన్మానాలు చేసినప్పుడో కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. కనుక కీర్తి ప్రతిష్టలను కూడా మహా భాగ్యంగానే భావించి, వాటిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Thursday, May 8, 2008

సద్గ్రంధ పఠన

చీకటిని తొలగించాలంటే వెలుతురును ఆహ్వానించాలి. జ్ఞానాన్ని పొందాలంటే అజ్ఞానాన్ని పారద్రోలాలి. జ్ఞాన సముపార్జనలో ఆధ్యాత్మిక గ్రంధములను పఠించుట అతి కీలకమైనది. మానవ మేధస్సుకందని అనేక రహస్యాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. ఆలాగే మానవునికి తెలియని ఎన్నో అద్భుతమైన, అత్యంత విలువైన విషయాలు మన గ్రంధాలలో భద్రపరచబడి ఉన్నాయి. అందులకే ప్రతివారు విధిగా గ్రంధ పఠన చేయవలసిన అవసరమెంతైనా ఉంది. సద్గ్రంధ పఠన చేయడం ఇంకా ఉత్తమమైనది.

మానవ జీవితం నీటి బుడగలాంటిది. ఒక్కొక్క క్షణం గదచిపోతూ ఉంటుంది. జీవిత పరమార్ధాన్ని ప్రాప్తించుకొనుటకు సద్గ్రంధ పఠనే శరణ్యం. "మంచి పుస్తకం మంచి స్నేహితునివంటిది". మంచి పుస్తకం చదవడంవల్ల మనసులోని ముడులు విచ్చుకొని విశాలభావాలు వెల్లివిరుస్తాయి. మనిషిలో మార్పు వచ్చి, ఎద కరుణ రసంతో పొంగి పొరలుతుంది. పుస్తకంలోని పునీత వాక్యాలు హృదయాన్ని కదిలించివేస్తాయి. అంతరంగాన్ని అనంత భావ తరంగాలతో మధించగలుగుతాయి.

మానవుడు తన సర్వశక్తులను స్ధంభింపజేసి, ఈశ్వర భావనలో పూర్తిగా లీనమై, దివ్యమైన రచనలు పఠించినట్లైతే జ్ఞాన సరస్వతీదేవి ప్రతి అక్షరంలో మహత్తర శక్తిగా నిండుకొని, అనంతకోటి సద్భావనా తరంగాలను వెదజల్లగలదు. అణు విస్పోటనం కొంత ప్రేదేశం వరకే. హృదయ విస్పోటనం విశ్వవ్యాపిత ప్రభంజనమై విరాజిల్లుతుంది. శతకోటి హృదయాలను స్పందింపజేస్తుంది.

అంతటి శక్తి పూరితమైన, భావగర్భితమైన రచనలు చదివి మానవులు తమ ప్రస్ధుత స్ధితినుండి ఒక మెట్టు పైకి వెళ్ళగలిగితే జన్మ ధన్యమైనట్లే. సమత, మమత, మానవత, సేవ, పవిత్ర ప్రేమ భావాలు కేవలం సద్గ్రంధ పఠనవల్లే సాధ్యం. మహాత్ముల జీవిత చరిత్రలు, సద్గురువుల సందేశ గ్రంధములు, దేశభక్తి పూరిత దివ్య రచనలను అహర్నిశలు పఠించి ఆత్మోన్నతిని పొందడం అభిలషణీయం.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Wednesday, May 7, 2008

మాయ

మాయ ఎండమావి లాంటిది. మనిషికి లేనిపోని భ్రమలను కల్పించి బోల్తా కొట్టించేదే మాయ. మాయను జయించలేక మహామహులే మట్టి కరచినట్లు చరిత్ర చెబుతోంది. మాయ మనసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనసెప్పుడు బలహీనపడుతుందాయని ఎదురుచూపులు చూస్తుంది. ఎలుకకోసం పిల్లి కాచుకొని కూర్చున్నట్లుగా మాయ అదనుకోసం పొంచి ఉంటుంది.మనసు తాత్కాలిక ఆనందాలకోసం పెంపర్లాడినప్పుడు మాయ తన పనిని అతి సులువుగా నెరవేర్చుకుంటుంది.

నైతిక విలువలను పతనం చేయటంలో మాయ మనసుకు బాగా సహక రిస్తుంది. మనిషిని అనేక బలహీనతలకు బలిచేసి, పేరు ప్రతిష్టలను మంటగలిపి సభ్య సమాజంలో దోషిగా నిలబెడుతుంది. రకరకాల ట్రిక్కులతో, మ్యాజిక్కులతో వశపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక మార్గంలో లొంగకపోతే మరొక దారిలో వశం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మనిషిలోని బలహీనతలను పసిగట్టి ఉపాయంతో లొంగదీసుకుంటుంది.

జీవితాంతం మాయలో చిక్కి, శాప విమోచన కాగానే పూర్వ రూపం దాల్చిన పురాణ గాధలెన్నో మనం చదివాం. మనకు తెలియకుండానే
రెప్పపాటులో మాయలో చిక్కుకుంటాం.అదే మాయకున్న అమోఘమైన శక్తి. మాయ ప్రభావంలో ఉన్నంతసేపు కలలో గాంచిన దృశ్యాలన్నీ నిజమని ఆ క్షణంలో మనం నమ్మినట్లుగా, మాయలో ఉన్నప్పుడు మనం చేసే పనులు సవ్యంగానే తోస్తాయి. నిజం తెలుసుకునేసరికి పరిస్ధితి చేయిదాటి పోతుంది. అనేకమైన అనర్ధాలు జరిగిపోతాయి.

ఆధ్యాత్మిక అహం సన్నిధిలో మాత్రమే ముంగీస ముందు పామువలె మాయ పడుకుంటుంది. మంచి మార్గం వీడిన మనిషిని మాయ పెడతన్నులు తంతుంది. తన గుప్పిట్లో శాశ్వతంగా బంధించుకుంటుంది. ఇంత గొప్ప శక్తిగల మాయను జయించాలంటే మానవుడు వివేక, వైరాగ్యాలను దండిగా సంపాదించుకోవాలి. నిత్యానిత్య వస్తు వివేచన కలిగి యుండాలి. మనం మానసికంగా ఏ స్ధితిలో ఉన్నామో మనల్ని మనం ఎల్లప్పుడు విశ్లేషణ గావించుకోవాలి. బ్రతుకు బండిని బహు జాగ్రత్తగా నడుపుకుంటూ, మాయకు చిక్కకుండా మంచి మనిషిగా మసలుకుంటూ జీవితాన్ని పండించుకోవాలి.

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

వైరాగ్య సంపద

“మగువ కుచంబులు బంగరు చెండ్లని మరి మరి మోహము జెందకురా తగదుర చీయవి మాంస ముద్దలని తలచి యసహ్యము నొందుమురా” యని ఆది శంకరులు భజగోవిందంలో కామ వాంచను వైరాగ్య భావంతో ఎలా నిగ్రహించుకోవచ్చో తెలియజేశారు. ధన కనక వస్తు వాహనాది సంపదలకన్న వైరాగ్య సంపద చాలా గొప్పది. తీవ్ర వైరాగ్యంచేతనే పచ్చి వ్యభిచారియైన వేమన యోగిగా మారగలిగాడు. ప్రగాఢ వైరాగ్యం మూలంగా సిద్ధార్ధుడు గౌతమ బుద్ధునిగా మారాడు. మానవుడు సంసారంలో సంచరించేటప్పుడు బురదలో కుమ్మరిపురుగు మాదిరిగా, తామరాకుపై నీటిబొట్టువలె విషయాలను మనసుకు అంటించుకోకుండా ఉండాలంటే తీవ్ర వైరాగ్య భావమే శరణ్యమౌతుంది.

సాధు సజ్జనుల సాంగత్యంవల్ల, ఆధ్యాత్మిక గ్రంధ పఠనలవల్ల, నిత్యానిత్య వస్తు వివేచనవల్ల్ల మానవునిలో వైరాగ్య భావం కలుగుతుంది. తద్వారా తనలో తాను అంతర్ముఖుడై జ్ఞాన మార్గంలో పయనిస్తాడు. వైరాగ్య భావన పరాకాష్టనొందితే మనకు కనిపించే తళుకు బెళుకుల ప్రపంచమే నిత్యం, సత్యమనే భ్రమ తొలగుతుంది. తాత్కాలికమైన సౌకర్యాలు, సుఖాలు శాశ్వతం కావని, నిత్య సత్యమైన, అజరామరమైన ఆత్మతత్త్వం మాత్రమే శాశ్వతమైన సంపదగా మానవుడు గుర్తిస్తాడు.

వైరాగ్యం గురించి మన పురాణాలలో, శాస్త్రాలలో ఎంతో విపులముగా వివరించబడింది. వైరాగ్యమంటే పంచ భూతములతో కూడిన దేహము నాదనే భావనను తొలగించుకొని, భౌతిక సుఖ సంపదలపై ఆకాంక్షను వదలుకోవాలని అర్ధము. అంతేగాని మనం చేసే నిత్య కర్మలలో అనాసక్తిని పెంచుకోమని అర్ధం కాదు. మనం చేసే దైనందిన కార్యకలాపాలలో 60 సం.లలో 20 సం.ల ఉత్సాహం, 20 సం.ల లో 60 సం.ల వైరాగ్యం కలిగి ఉండాలి. అప్పుడే మనం మన విద్యుక్త ధర్మాలను సమర్ధవంతంగా నెరవేర్చగలం.


మానవుడు దైనందిన జీవన పోరాటంలో దుస్ట సాంగత్యంపట్ల, చెడు తలంపులపట్ల, దురలవాట్లయందు వైరాగ్య భావనను ప్రదర్శించాలి. మంచి స్నేహితులను సమకూర్చుకొని, మంచి భావాలను పెంపొందిచుకొని, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. మానవజన్మ పరమార్ధమైన ధర్మార్ధ కామ మోక్షములను సాధించడానికి ప్రగాఢ వైరాగ్య భావనే ఉత్తమమైన మార్గమని గ్రహించాలి..

నాగులవంచ వసంతరావు

Tuesday, May 6, 2008

యువత - నడత

భారతదేశ భవిష్యత్తు యావత్తు యువతీ యువకుల భుజస్కందాలపైనే ఉందని, వారు దానికి సమర్ధులని స్వామి వివేకానందులవారు ఏనాడో పిలుపునిచ్చారు. వారు యువతరంపై అంతులేని ఆశలు పెట్టుకున్నారు. వజ్ర సంకల్పంతో విద్యనార్జించి, విజ్ఞానవంతులుగా మారి జాతి ఔన్నత్యానికి రాచబాటలు వేయాలని ఎన్నో కలలుగన్నారు. నేటి యువతరం ఆలోచనా విధానం, ప్రవర్తననుగనక గమనించినట్లైతే తీరని ఆవేదన కలుగక మానదు.

నేటి యువతరం ఎందుకిలా భాద్యతారహితంగా తయారయ్యారు అనేది అనేకమంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. తమ పిల్లలు తమలా కస్టపడ కూడదని, తాము తిన్నా తినకున్నా వారికోసం ఎంతో త్యాగం చేసి పెద్దలు తమ పిల్లలను పెంచుతున్నారు. పిల్లల ముందే “ మీరు కస్టాలపాలు కాకుండా ఉంట మాకంతే చాలు, నీ బాగే మా భవిష్యత్తు, మమ్ముల చూడకపోయినా నీవు సుఖపడితే చాలు” వంటి మాటలు తరచుగా కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. దీనిని ఆసరాగా తీసుకొని పిల్లలు పచ్చి స్వార్ధపరులుగా తయారవుతున్నారు. కొంతవరకు ఈ విషయంలో తల్లిడండ్రులే భాద్యులని చెప్పక తప్పదు.

పక్కవాడి గురించి కాని, సమాజం గురించి కాని పిల్లలకు బోధించక, కేవలం తాను మంచి మార్కులు తెచ్చుకొని,మంచి ఉద్యోగం సంపాదించుకొని, హాయిగా జీవించమని పిల్లలకు లేత మనసులలో చిన్నప్పటినుండి నూరిపోయడం వలన వారిలో విశాల భావాలు మొలకెత్తడం లేదు. అదే విధంగా తమ తల్లిదండ్రులపట్ల ప్రేమాభిమానాలను, త్యాగాలను చేయలేక పోతున్నారు. తమవరకే గానుగెద్దులా గిరిగీసుకొని జీవిస్తున్నారు. ఏ కొద్దిమంది యువతీ యువకులు మాత్రమే తల్లిదండ్రుల ప్రేమను, వారు చేసిన త్యాగాన్ని అర్ధం చేసుకొని వారిపట్ల ప్రేమాభిమానాలతో నడచుకోగలుగు తున్నారు.

యువతరం తమ స్నేహితులతో చాలా మంచి సంభంధాలను కలిగి ఉంటారు. కాని ఇంట్లో తల్లిదండ్రులపట్ల నిర్లక్ష్య భావంతో మాట్లాడతారు. తమ అహంకారాన్ని మాతా పితరులపై ప్రదర్శిస్తారు. వారి మాటలకు ఎదురు చెప్పలేరని మానసికముగా సిద్ధపడి మనోవేదనకు గురిచేస్తారు. తల్లిదండ్రుల ప్రేమను బలహీనతగా భావించి రకరకాల కోర్కెలను తీర్చుకొనుటకు వారిని పావులుగా వాడుకొని చివరికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుపట్ల తల్లిదండ్రులు కన్న కలలను కల్లలు చేస్తున్నారు. ఇతరుల ముందు చాల సౌమ్యంగా, సంస్కారవంతంగా మాట్లాడే పిల్లలే ఇంట్లోవారిపట్ల చాలా దురుసుగా, తలబిరుసుగా ప్రవర్తి స్తూ ఉంటారు.

నటించడంలో పిల్లలు సిద్ధహస్తులని చెప్పవచ్చు. తమ పిల్లలు చాలా మంచివారు, బుద్ధిమంతులని తల్లిదండ్రులు భావించేలా వారి ప్రవర్తన ఉంటుంది. కాని నిజానికి వారి అసలు స్వరూపం వారి స్నేహితులకు తెలుస్తుంది. స్నేహితుల మాటలకు ఇచ్చిన విలువ తల్లిదండ్రుల మాటలకు ఇవ్వరు. ఎందుకంటే స్నేహితుల మాటలు మధురంగా, ఇంద్రియాలను ఉసిగొలిపి, మనసుకు మత్తెక్కించేవిగా ఉంటాయి. పెద్దవారి మాటలు కటువుగా, ఆచరణకు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి పెడచెవిని పెడతారు. తమ స్నేహితులకు వారితల్లిదండ్రులిచ్చిన ప్రాధాన్యత మీరు మాకివ్వడం లేదని తల్లిదండ్రులతో పోరాడుతూ ఉంటారు యువతీ యువకులు.

యువతలో భావ కాలుష్యం ఇదివరకు కేవలం స్నేహితులవల్లే వచ్చేది. కాని ఈనాడు ఇంటర్నెట్ ద్వారా చెప్పలేనంత భావ కాలుష్యం యువతీ యువకులున్న ప్రతి ఇంటికీ చేరుకుంటుంది. రకరకాల సంభాషణలు జరుపుతూ ఇంద్రియాలను ఉద్రేకపరుచుకుంటూ సమయం గడుపుతూ తాము బాగా ఎంజాయ్ చేస్తున్నామని భ్రమపడుతూ, తల్లిదండ్రుల కంట్లో కారం కొడుతున్నారు చాలా మంది యువతీ యువకులు. ఎంతో ఉపయోగకరమైన ఇంటర్నెట్ సాధనాన్ని చిల్లర విషయాలకు ఉపయోగించడం క్షమించరాని నేరం. కంప్యూటర్ ముందు గంటల తరబడి చాటింగ్ చేస్తూ, ఇంద్రియాలతో ఆనందిస్తూ, మనసునిండా విషాన్ని నింపుకుంటుంది యువతరం. తాము నవీన విజ్ఞానాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకో గలుగుతున్నామని పరిశీలించుకోవాలి. ఈ విషయంలో ఎవరికి వారే అంతరాత్మను ప్రశ్నించుకోవాలి.

ఇక సెల్ ఫోన్ సంగతి సరేసరి. ప్రేమికులకిదో వరమని చెప్పవచ్చు. రహస్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కుటుంబ పెద్దలకు తెలీకుండా ప్రేమ వ్యవహారాలు సాగించవచ్చు. అవసరమున్నా లేక పోయినా గంటలతరబడి పిచ్చాపాటి మాట్లడుకోవడం మనం గమనించవచ్చు. తల్లిదండ్రులకు బిల్లుల రూపంలో అంతులేని భారాన్ని మోపవచ్చు.

శ్రద్ధగా చదువుకునే వయసులో సినిమా మోజులోపడి కర్తవ్యాన్ని మరచిపోతున్న ఎందరో యువతీ యువకులను మనం కళ్ళారా చూస్తున్నాం.
రంగుల ప్రపంచానికి, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందన్న విషయం తెలియని పసి వయసులో సినిమాలో మాదిరిగా ప్రేమలు, త్యాగాలు, ఫైటింగులు చేయాలని యువతరం ప్రయత్నించి, భవిష్యత్తును అంధకారబంధురం చేసుకుంటున్నారు.

ఇక పెళ్ళి విషయానికొస్తే ప్రెమించి పెళ్ళిచేసుకోవాలనేది యువతరం కోరికలలో ప్రధానాంశంగా మారింది. చదువుకునే రోజుల్లోనే, తెలిసీ తెలియని వయసులో, అనుభవంలేని తరుణంలో ఎదుటివ్యక్తిని అంచనా వేయటం చాలా కస్టం. వ్యక్తిత్వ పరిశీలనకు అవకాశమే లేదు. అలాంటి సమయంలో కొత్త వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించడం నిజంగా సాహసమనే చెప్పాలి. క్షణిక ఆవేశంలో, కామ వికారాలతో వికృతమైన నిర్ణయాలు తీసుకున్న పాపానికి జీవితాంతం అస్టకస్టాలు పడుతున్న ఎంతోమంది యువతీ యువకులను మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రతినిత్యం పత్రికల్లో మోసపోయిన వారి గురించన కధలెన్నో చదువుతున్నాం. వాటిని చూసి కూడా యువతరం తమ ఆలోచనా సరళిని మార్చోకోక పోవడం కడు శోచనీయం.

ప్రేమించి పెళ్ళి చేసుకోని జీవితం అసంపూర్ణమనే భావనకు యువత దిగజారింది. ఎవరు యోగ్యులో, సమర్ధులో అనే అంశం పిల్లలకన్నా పెద్దలకే బాగా తెలుసునన్న నగ్నసత్యాన్ని యువత జీర్ణించుకోలేక పోతున్నది. ఫ్రెమించని జీవితం వ్యర్ధమనే భావనకు యువత రాడం నిజంగా దురదృష్టకరం. పోనీ వారి ప్రేమ అంత పవిత్రమైనదా అంటే సమాధానం దొరకదు. కామోద్రేకాన్ని, తొందరపాటుతనాన్ని ప్రేమగా వర్ణించుకుంటున్నారు యువతరం.


ఉద్యోగం చేసే సమయంలో ప్రేమించడం, పెళ్ళిచేసుకోవడం కొంతమేరకు సమర్ధనీయం. ఆ వయసులో కొంత అనుభవం, ఇంద్రియ నిగ్రహం, వ్యక్తిత్వ వికాసం కలుగుతాయి కాబట్టి ఎంపిక చేసుకోవడంలో తప్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఎన్నొ జంటలు మధ్యలోనే విడిపోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. యువత తాము ప్రేమించడమే కాకుండా తమ సన్నిహితులు ప్రేమిస్తే వారి వివాహ ఏర్పాట్లు చేసి, దగ్గరుండి పెళ్ళి జరిపించడంలో ఆరితేరిపోతున్నారు. దానినొక సమాజ సేవా కార్యక్రమంగా పరిగణిస్తున్నారు.

యువత ఎంతసేపటికి తమ జీవితం, భవిష్యత్తు, సంపాదన గురించే కలలు కంటూ ఉంటారు. తమను కని, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రుల కలల విషయం మర్చిపోతున్నారు. అంతులేని స్వార్ధంతో ప్రవర్తించి తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేస్తున్నారు. పెద్దల అహాన్ని దెబ్బ తేసే విధంగా మాటల్లో, చేతల్లొ ప్రదర్శిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో
చేయి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. పట్టరాని కోపంతో పెద్దలను దూషించడం మనం కొంతమంది పిల్లల విషయంలో గమనించ వచ్చు. పెద్దల మనసు ఎంతగా గాయపడి తల్లడిల్లిందో పిల్లలకు తెలియని శోచనీయమైన పరిస్ధితి నేడు నెలకొని ఉంది.

తమ చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలే తమను ఎదిరిస్తుంటే చూసి తట్టుకోలేక తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. వారు ఎక్కడ చెడు త్రోవలో పయనిస్తారొనని పరిపరి విధాల పరితపిస్తుంది తల్లి మనస్సు. పిల్లలలో వచ్చిన ఆకస్మిక మార్పును జీర్ణించుకోలేక పోతున్నారు కన్నవారు. వారిలో మార్పుతేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. సంస్కారంగల కొంతమంది పిల్లలు ఈ దశలో తమ ధోరణిని మార్చుకుంటున్నారు. అంతులేని అహంకారంతో, వ్యర్ధ గర్వంతో మూర్ఖంగా ప్రవర్తించే కొంత మంది పిల్లలు మానసిక మార్పుకు సిద్ధపడక మొండిగా ప్రవర్తిస్తూ తల్లి దండ్రులను మనోవేదనకు గురిచేస్తున్నారు.

సాంసారిక జీవితంలో తల్లిదండ్రులు పిల్లలను కని, పెంచి, ప్రయోజకులను చేయాలని కన్న కలలు మంచులా కరిగిపోతుంటే నిశ్చేష్టులై తిలకిస్తున్నారు. చేసేదిలేక చతికిలబడిపోతున్నారు. ఇలాంటి దుర్దశ ఎవరికీ పట్టకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నారు. యువతరం మనసు మార్చమని మూగగా రోదిస్తున్నారు.

నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.