వివేక దృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు. తాను, జగములు రెండు బ్రహ్మమునుండి వచ్చినవే. నిజ దృష్టితో పరికించిన జీవుడు దైవత్వమునకు అభిన్నం. భగవంతునిచే ఉద్భవించిన జీవులు భగవత్ స్వరూపులే కాగలరు. బెల్లముతో చేసిన వంటకములు తీపిగ ఉండునేగాని చేదుగ ఉండవు. అలాగే జీవులు దైవాత్మ స్వరూపులేగాని వేరుకాదు. పర:బ్రహ్మ యొక్క అంశ రూపముగల జీవుడు సాంసారికమైన మాయలోపడి తన నిజరూపమును తెలియజాలకున్నాడు. నేను దైవాంశమనియు తెలియలేకున్నాడు. ఇట్టిజ్ఞానము కలుగుటయే విశిష్టాద్వైత సిద్ధాంత సాఫల్యము. భగవద్భావనగల జీవుడు భగవత్ కృపచే భగవత్ స్వరూపమై భాసిల్లగలడు. మోక్షమనిన, స్వర్గమనిన అదొక ప్రత్యేక స్ధలము కాదు. కేవలం దివ్యానుభూతి. మానవుడు జ్ఞాన దశలో జ్ఞానేంద్రియముల వశము గావించుకొని ద్వంద్వాతీతుడై మోహవర్జితుడగును. ఇదియే మోక్షావస్ధ.ఈ మోక్షము ఇంకెచ్చటనో బయటలేదు. తనలో తాను రమించినపుడే అనుభూతి కాగలదు. మోహ విసర్జనమే మోక్షమునకు దారి.
ప్రతి భక్తుడు స్వకీయ సాధనలో ఇంద్రియాలను, మనస్సును, అహంకారాన్ని జయించి, రాగద్వేషాదులను, సుఖదు:ఖ ద్వంద్వాలను అతిక్రమించి, దేహేంద్రియ మనంబులను ఈశ్వరార్పణ గావించుటే నిజమైన భక్తి. ఏ ప్రాణిపట్ల వైరభావం లేకుండ, భగవంతునిపై తప్ప ఏ ఇతరముపై కోరిక లేకుండుటయే మోక్ష ప్రాప్తికి ఉపాయము. యధార్ధ భక్తుల పాద ధూళి సర్వలోక పర్యంతం పవిత్రం చేస్తుంది. ఒకతరం నాటిన పనస మరుసటి తరానికి ఫలములనిస్తుంది. ఆలాగే ఒక జన్మలోని పుణ్య కర్మలు మరుసటి జన్మలో ఫలితమునిచ్చును. ఆందులకే ముందు జన్మ సార్ధకం గావాలనిన ఈ జన్మలోనే సత్కర్మలు చేయాలి. అందం, చదువు, అధికారం, కులం, మతం ఇవేవియును మంచి జన్మకు ఉపకరించవు.
ప్రతి జీవి ఘనీభవించిన మోక్ష స్వరూపమే. నీవే నిత్య శుద్ధ, భుద్ధ, ముక్త స్వరూపివి. అట్టి మన నిజస్ధితిని మరువటం ఘోర పాపం. భక్తుడు, భక్తి, భగవంతుడు ఈ మూడు ఏకావస్థ నొందుటయే పరిపూర్ణ దైవస్థితి. భ్రమర కీటక న్యాయానుసారం, నీవు ఆరాధించు ఆరాధ్య మూర్తి స్వరూపముగా నిలిచినపుడే నీ ధ్యానం పూర్తి ఐనట్లు. ఆంత్య సమయమున స్మృతికి వచ్చునదే జీవితమునకెల్ల ఫలము. మనం ఎలా కాదలంచిన అలా అయ్యే శక్తి మనకుంది. భగవంతుడనిన వ్యష్టిగా ఒక వ్యక్తి కాదు. సమిష్టిగా సర్వశక్తి. వ్యష్టిగ నీ ఆలోచనలను మానుకొని, వ్యక్తి మనస్సును అనంత విశ్వ మనస్సులో విలీనపరచాలి. అట్టి అఖండ సంకల్ప శక్తిని లౌకిక విషయాలలో చొప్పించరాదు. సమస్త దేవతా చక్రవర్తివి నీవే. మొక్కోటి దేవతలు నీయందే మూర్తీభవించి యున్నారు. ఈ రహస్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. స్మృతి రూపమైన జగాన్ని పూర్తిగ మరచిపోయి నీవు నీవుగ ఉండటమే నిజ మోక్షం. సూర్యుడు ఉదయించగానే మంచు కరిగిపోవునట్లు ఆత్మదర్శనం కాగానే ఆత్మ నిలువదు. దేహమనే దేవాలయములో సోహంభావార్చనకు మించిన ఆరాధనలేదు. దైవమును హృదయములోనే గాదు విశ్వమంతటిలో దర్శించగలగాలి. భవంతుని తెలుసుకొనుటకు ముందుగ మనలను మనం తెలుసుకోవాలి. అపుడే చక్కటి దైవానుభూతి చిక్కగలదు.
ఉద్ధరణ పైనుండికాదు, తనలోనుండి జరగాలి. నివురుగప్పిన నిప్పువలె తనయందు నిద్రాణమై వున్న ఆత్మశక్తిని మేల్కొల్పుటయే నిజమైన ఉపదేశం. ఇది ఒకరు ఇచ్చేది, మరొకరు పుచ్చుకునేది కాదు. కేవలం తనలో ఉన్నదానిని తెలియపరచటం. ఓ వివేకీ మేలుకో! ఫ్రజ్ఞను నిండా వికసింపజేయి. ఎదుటివారిలోని సుగుణాలను, దివ్యత్వమును గౌరవించి, పూజించాలిగాని నీలోని దివ్యత్వమును సాక్షాత్కరించుకో! అలాగాకుండ నిన్ను నీవు మరుగుపరచుకొని ఏమి చేసినా వృధా శ్రమయే కాగలదు. సమస్త అద్భుతములు, లీలలు, మహత్తులు నీ నిజస్ధితికి అతీతములు ఏనాటికి కావు. అట్టి నిన్ను నీవు తెలుసుకో.
జీవాత్మలు జలబిందువులు. జలబిందువు సాగరమునకు వేరుగ ఊంది ఎంత చింతించినా, ధ్యానించినా సాగరం ఉనికి తెలియదు. జలబించువు సాగరము లో లయించిన అది సాగర రూపం చెందగలదు. అలాగే అనంత దైవస్ధితిని అనంత పరిధిలో నిల్చిననే గ్రహించుటకు వీలవుతుంది. కావున మనం అనంత విశ్వ హృదయులం కావాలి. మానవుడు సంకుచిత జలబిందువు దృష్టి వీడి సాగర స్వరూప ప్రజ్ఞతో వర్ధిల్లాలి. సర్వమత గ్రంధముల, సమస్త బోధనల సారాంశమిదియే.
బాహ్యంలో ఉంచబడిన కుండ లోన, బయట ఒకే ఆకాశం కలదు. కాని కుండలోనిది ఘటాకాశము, బయటిది మఠాకాశం. కుండ పెంకు భిన్నత్వమును సూచిస్తుంది. కుండ పగిలిన కేవలం ఆకాశం మిగులుతుంది. దేహి ఘటాకాశం వంటిది. దేహమనే ఆటంకం తొలగిన సర్వ దేహి నేనే, సర్వాంతరాత్మ నేననే స్ధితి బోధపడుతుంది. ఫూజార్హమైన పర:బ్రహ్మ స్ధితి నీయందే మూర్తీభవించి యున్నది. దీనిని మరచి దేని ముందు సాగిలబడినా లాభంలేదని తెలియాలి.
ఈ సృష్టి సమస్తం ఏ శక్తిని ఆశ్రయించి నడుస్తుందో, ఆ శక్తి నీయందు కూడా కలదు. అంతర్ముఖుడవై స్వనిష్టనొందాలి. సమస్త సాధనల,యోగ సిద్ధుల సారాంశమిదియే. దివ్య స్వభావ శక్తి విద్యుత్ తేజమును మించినది. అందువలన భావమును భగవన్మయము చేయాలి. ఈ స్ధితిలో సమస్తము దైవ స్వరూపముగ గోచరిస్తుంది. హృదయాంతర్వాణిని విని, అంతర్ స్వరమును అనుసరించువారికి వేరే బాహ్య గ్రంధములతో పనిలేదు. తానే విశ్వమత మహగ్రంధము కాగలడు. నీ నిజాత్మ దివ్య స్ధితిని విస్మరించి వేరే ఎక్కడో దైవస్ధితిని ఊహించుట భూటకము. ఏ విషయములోనైనా ఒకరు చెప్పేది అప్పటివరకే. అందులకే నీవు నీవుగ ఆలోచించు. సత్యాన్ని అన్వేషించి దర్శించు. అప్పుడు నేవే సాక్షాత్ సత్యాత్మ స్వరూపుడవని తెలియగలదు. ఎటువంటి భావ చింతన గలవారు అటువంటి భావ సిద్ధిని పొందగలరు. దైవభావం గలవారు దైవ స్వభావ స్వరూపమును పొంది నిలిచెదరు.
నిలుకడలేని మనస్సుకు సంకెళ్ళువేసి, బహిర్ముఖ పదార్ధములవైపు పయనించకుండ, మదపుటేనుగును లొంగదీయుటకు అంకుశమువలె నియమ నిష్టలు, దీక్షలు, వ్రతములు, ఆరాధనలు, చాతుర్మాస్య వ్రతములు ఆకోవలోనివి. మనస్సు యోచనలో కేంద్రీకరింప బడినపుడు అది మానస పూజ. దీనిచే అజ్ఞాని జ్ఞాని యగును. మానవుడు మాధవుడగును. ఏనాటికి చావులేనిది, మార్పులేనిది, నాశనంలేనీ ఏదో దానిని తెలుసుకోవాలి. ఏది మాత్రం గలదో అదియే నీ స్వరూపమని నిశ్చయించుకో. ఈ అనంత విశ్వ పర్యంతం దేవుడు కానిది, దేవుడు లేనిది ఏదియును లేదని తెలియవలయును. దేవునికి భిన్నముగా ఆలోచించునదంతయు అసత్య మని తెలుసుకోవాలి.
స్వస్వరూప ఆత్మ పరిజ్ఞానమును కలిగించలేని నిరర్ధక మార్గాలకు స్వస్తి చెప్పాలి. ఎవరికి వీలున్న పరిధిలో వారు దైవ సాక్షాత్కారము కొరకు ప్రయత్నించ వచ్చు గాని ఆ మార్గం మనకు ఆత్మ సాక్షాత్కారము కలిగించునదిగా ఉండాలి. సాధనలన్నియును ఆత్మ సాక్షాత్కారముతో ఆగిపోగలవు. కేవలం ఆత్మ స్దితిలో ద్వంద్వ బంధాలు లేవు. నీవు సాక్షాత్ సర్వేశ్వర దైవ స్వరూపమేగాని వేరుకాదు. ఆ అనుభూతిని పొందు పర్యంతం సాధకులు విశ్రమించరాదు. నీలో ఉన్న నీవు ఈశ్వరుడే. జగమంతయు ఈశ్వరుడే. కేవలం తన్ను తానుగ ఉన్నది ఈశ్వరుడే. ఆ మూడు స్ధితులలో సర్వేకత్వ పరిపూర్ణ దైవ స్ధితిలో నిండియున్నది నీవే. కేవలం ఆత్మ జ్ఞానం సిద్ధించువరకే జీవేశ్వర బేధము. ఆత్మ జ్ఞాన స్ధితిలో జీవత్వం లయించి, ఈశ్వరత్వం శేషించును. సర్వంలో తాను నిండి యుండి, సర్వమును కలిగియున్నవాడే వాసుదేవుడని తెలియాలి. ప్రతి ప్రాణిలో ఉన్నది వాసుదేవుడే. జగమంతయు వాసుదేవుడే. జీవేశ్వర, జగదీశ్వర, కేవల సర్వేశ్వర ఈ మూడు స్ధితులలోని త్రిత్వేక సంపూర్ణ దైవత్వం నీది. పరమాణువును సైతం విస్మరించకుండ సమస్తమును ఐక్య పరచి చూడాలి. అదియే దైవ దర్శనం.
కలియుగమనగా కంగారు యుగమని అర్ధము. ప్రపంచమతా టెన్షన్ మయం. ఎవరిని మందలించినా సమస్యలే. సమస్యల వలయం నుండి బయట పడవలయుననిన కేవలం ఆత్మ సాక్షాత్కార జ్ఞాన మొక్కటే శరణ్యం. అజ్ఞానమే అన్ని సమస్యలకు మూలం. ఎవరి ముక్తి వారి స్వాధీనమై యున్నది. అజ్ఞాన బంధ నివృత్తియే నిజమైన ముక్తియని గ్రహించవలయును. ముక్తి, మోక్షం అని ఆకాశం వైపు అర్రులు చాచి చూడవలసిన పనిలేదు. చిన్మయ పరమార్ధ దృష్ట్యా ప్రతి జీవి ఘనీభవించిన దివ్య మోక్ష స్వరూపమేనని గ్రహించాలి. అదియే సంపూర్ణ దైవ దర్శనం.
- నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.